సంస్కృతాంధ్ర సాహితీసౌరభం
ప్రాచీన కావ్యనాటక గ్రంథ పరిచయం 3 – పద్మప్రాభృతక సౌరభం – శూద్రక మహాకవి
3. పద్మప్రాభృతక సౌరభం – శూద్రక మహాకవి
సంస్కృతభాషా ప్రచార సమితి, హైదరాబాదు వారి రజతోత్సవ సందర్భంగా, రజతోత్సవ గ్రంథమాల శీర్షికన ఇరువది ఐదు గ్రంథములను ప్రచురించారు. వాటిలో ఐదవ కుసుమముగా, మహామహోపాధ్యాయ ఆచార్య డా. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు మృచ్ఛకటికఛ్చట అనే శీర్షికతో శూద్రక మహాకవి రచించిన రెండు గ్రంథములను సమగ్ర విశ్లేషణతో పరిచయం చేసారు.
శూద్రకుడు వ్రాసిన ఆ రెండు గ్రంథములు 1) మృఛ్చకటికం 2) పద్మ ప్రాభృతక సౌరభం.
ఈ పద్మప్రాభృతకం యొక్క కథారచనా విధానము, భాషాసౌందర్యము, నూతన భాషా పద ప్రయోగాలు నాకు బాగా నచ్చినందున, ప్రాచీన కావ్య నాటక గ్రంథ పరిచయం శీర్షికన ఇక్కడ పద్మప్రాభృతకసౌరభం ని పునఃపరిచయం చేయ సంకల్పించితిని. దీనికై ప్రథానముగా ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి పుస్తకమునే గ్రహించడమైనది. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారికిని, ఈ పుస్తమును అందించిన సంస్కృత భాషా సమితి వారికిని ఎంతయూ కృతజ్ఞుడిని.
పద్మప్రాభృతకం
ఇందలి కథా ఇతివృత్తము శృంగార రస ప్రథానమైనది. వేశ్యాలంపటత్వం గలవారి చుట్టూ పరిభ్రమెంచే కథావస్తువు. ఇటువంటి కాథావస్తువు కలిగిన గ్రంథం గురించి ఇప్పుడు ప్రస్తావించవలసిన ఆవశ్యకత ఏమిటీ అనే ప్రశ్న తలెత్తుతుంది.
దానికి మూడు కారణాలు:
1. ఈ గ్రంథాన్ని పరిచయం చేయడానికి ప్రథాన కారణం, ఇందులోని భాషాసౌందర్యం. దీనిలో చక్కటి ఉపమానాలూ, నూతన పదప్రయోగాలు అనేకం కనిపిస్తాయి. ఇది రెండవ కారణం
2. భాషాసంబంధమై వివిథ ప్రక్రియలు రచనలలో ఉపయోగిస్తారు. కాలక్రమేణా జనబాహుళ్యానికి అవి తెలియక మరుగున పడిపోతున్నాయి. భాషాపండితులకి, వాటిని తెలుసుకోవాలనే ఔత్సాహికులకీ తెలియకపోవు. అటువంటి ప్రక్రియలో ఒకటి నాటకం. అన్ని రచనలనీ నాటకాలు అనరు. వాటిలో చాలా భేదాలు ఉన్నాయి. ఏఏ ప్రక్రియలో ఈ గ్రంథాలని రచించారు, ఆ ప్రక్రియల యొక్క లక్షణాలని తెలుసుకోవడం అనేది ఒక కారణం.
3. ప్రస్తుతం మనచుట్టూ నెలకొని ఉన్న సామాజిక స్థితిగతులు, అంత ఉన్నతమైన, ఆదర్శాలు కలిగి ఉన్నది కాదు. భావిపౌరులకు అంతగా అనుకూలమైనవి కావు. అలాగని సమాజం పూర్తిగా భ్రష్టు పట్టేసి ఉందని కాదు. మంచిని నేర్పే కుటుంబాలూ ఉన్నాయి. మంచిని బోధించే ఆచార్యులూ ఉన్నారు. ఎంతో ఉన్నతవిలువలు కలిగిన గొప్ప గొప్ప వారూ ఉన్నారు. అయితే వీరి శాతం చాలా తక్కువగా ఉంటున్నది. చెడ్డవారి శాతం రోజురోజుకీ ఎక్కువైపోతూ ఉన్నది. మరి ఐయితే ఇప్పుడే ఇలాగ ఉందా? ఎప్పుడూ ఇలాగే ఉందా? ఎన్నాళ్ళ క్రితం నుండీ ఇలాగ ఉన్నది? కొన్ని వందల ఏళ్ళ క్రితం, కొన్ని వేల ఏళ్ళ క్రితం భారతదేశ సామాజిక వ్యవస్థలోని తీరు తెన్నులు ఎలాగ ఉన్నాయి అనే విషయాలని తెలుసుకోవాలి అంటే, సామాజిక వ్యవస్థ చుట్టూ పరిభ్రమించే కొన్ని మన తెలుగు భాషలో, సంస్కృత భాషలో ప్రముఖమైన పండితులు రచించిన గ్రంథాలు బాగా ఉపయోగిస్తాయి.
అటువంటి వాటిలో ఉదాహరణకి కొన్ని – శూద్రక మహాకవి రచించిన మృచ్ఛకటికము (ఇది అందరికీ తెలిసిన గ్రంథము – మనం చిన్నప్పుడు పాఠశాలలో దీని గురించి చదువుకున్నాము), శూద్రకుడు రచించిన పద్మప్రాభృతక సౌరభం (ఇది ఎక్కువ మందికి తెలియకపోవచ్చు), తెలుగు భాషలో మహాకవి శ్రీనాథుడు రచించిన క్రీడాభిరామము (ఇది వల్లభరాయ కృతము అని గ్రంథములో వ్రాసి ఉంటుంది, కానీ పండిత ప్రకాండులు దీనిని శ్రీనాథ కృతముగానే నిర్థారించారు), మహారాష్ట్రీ ప్రాకృత భాషలో శాలివాహన చక్రవర్తి రచించిన శాలివాహన గాథాసప్తశతి అనేవి.
ఆనాటి సామాజిక స్థితిగతులను తెలుసుకొనుటకు ఉపయించగలిగే గ్రంథం ఈ పద్మప్రాభృతం.
ఈ పైన ఉదాహరించిన గ్రంథాలని ఈ ముఖ్యోద్దేశముతో పరిచయం చేయవలెనని నా ప్రయత్నం.
కవి పరిచయం:
మృచ్ఛకటికం రచించిన కవి శూద్రకుడు. ఇతడు మహారాజు. శూద్రకుని గురించి, మృచ్ఛకటికం ప్రస్తావనలోనే విపులంగా చెప్పబడి ఉంది. శూద్రక మహారాజు అందగాడు, బ్రాహ్మణ శ్రేష్టులలోనూ, కవులలోనూ అగ్రగణ్యుడు. ఋగ్వేదము, సామవేదము, గణితము, వేశ్యలకి సంబంధించిన లలిత కళలు, గజశాస్త్రములోనూ నిష్ణాతుడు. ఏనుగులతో తలపడి యుద్ధము చేయగల బలశాలి. ఇతడు శివభక్తుడు. ఆశ్వమేధయాగం చేసిన వాడు. కుమారుని రాజ్యాభిషక్తుని చేసి, నూరు సంవత్సరముల పది రోజుల దీర్ఘాయుర్దాయమును అనుభవించిన పిదప, అగ్ని ప్రవేశము చేసి తనువు చాలించాడు.
శూద్రక కవి క్రీ.పూ. రెండవ శతాబ్దము – క్రీ.శ. రెండవ శతాబ్దము లోపు వాడని విశ్లేషకులకు విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి.
సంస్కృత భాషలో దృశ్య కావ్యాలను రూపకాలు అని వ్యవహరిస్తారు. వాటిని లాక్షణికులు లక్షణ గ్రంథాలలో పది రూపకాలూ, పద్దెనిమిది ఉప రూపకాలుగానూ చెప్పారు. రూపకాలు:
నాటకము, ప్రకరణము, భాణము, ప్రహసనము, డిమము, వ్యాయోగము, సమవాకారము, వీథి, అంకము, ఈహామృగము అనేవి రూపక భేదాలు. ఉపరూపకాలు: నాటిక, త్రోటకము, గోష్టి, సట్టకము, నాట్యరాసకము, ప్రస్థానము, ఉల్లాప్యము, కావ్యము, ప్రేంఖణము, రాసకము, సంలాపకము, శ్రీగదితము, శిల్పకము, విలాసిక, దుర్మల్లిక, ప్రకరిణి, హల్లీశము, భాణిక అనేవి ఉపరూపకాలు.
మృచ్ఛకటికము, ప్రకరణము అనే రూపక భేదానికీ; పద్మప్రాభృతికము, భాణము అనే రూపక భేదానికీ చెందినవి.
నాటకం, ప్రకరణం మొదలైన కొన్ని రూపక భేదాలలో ఉదాత్తమైన కథావస్తువును గ్రహించాలి అనే నియమం ఉంది. అభిజ్ఞాన శాకుంతలము, మృచ్ఛకటికము వంటివి వీటికి ఉదాహరణలు. మిగిలిన రూపకాలన్నింటిలోనూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను సమాజంతో ముడివడియున్న కథావస్తువే ఉంటుంది.
శ్రీనాథుడు రచించినట్టు చెప్పబడే క్రీడాభిరామము అనే దృశ్య రూపకం – వీధి అనే రూపక భేదానికి చెందినది. భాణము, వీధి రెండును ఇంచుమించుగా సమాన లక్షణములు కలవి. ఈ వీధి రూపకంలో కూడా సమాజంలో ఉన్న అలవాట్లనూ, ఆచార వ్యవహారలనూ విస్త్రుతంగా వర్ణించడమైనది. ఇది బహు శృంగార రసప్రథానమైన, విట సంబంధమైన కథా వస్తువు. చక్కటి భాషాపటిమ కలిగి, సమాసభూయిష్టమైన పద్యాలతో విలసిల్లే ఈ క్రీడాభిరామము అనే వీధి రూపకం భాషావేత్తల పాలిట కొంగుబంగారమే!
ప్రధానమైన రూపకాలలో భాణం ఒకటి. ఇది సమాజంతో ఘనిష్ట సంబంధం కలిగి, సమాజంలో ఉన్న అలవాట్లనూ, ఆచారాలనూ చెప్పే రూపక విశేషం. భాణంలో ప్రధానంగా సమాజంలో ఉన్న కొన్ని దురాచారలను ఎత్తి చూపడం జరుగుతుంది.
శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన “ఆంధ్ర దశరూపకము” ను బట్టి, భాణము యొక్క లక్షణములు:
1. ఏకాంకంబు, విటైకపాత్రవర్ణితకల్పితధూర్తచరితంబు, భారతీ వృత్తికంబు భాణంబు
2. సంబోధనోక్తి ప్రత్యుక్తు లాకాశభాషితంబులు
అనగా, భాణములో ఒక్కటే అంకము ఉండును. ఇతివృత్తము కల్పితము. అదియు ధూర్తచరితముగా ఉండవలయును. తానుగాని, యితరులుగాని అనుభవించినదిగా ఉన్నట్టి ధూర్తచరితమును, సమర్థుడును, విద్యావంతుడును అగు విటుడు అను ఒక్క పాత్రయే చెప్పవలెను.
భాణంలో విటుడు అనే ఒకే ఒక పాత్ర రంగస్థలం మీద కనబడతాడు. ఈ విటుడు, అతని ఎదుట ఎవరో ఒక వ్యక్తి ఉన్నట్ట్లు ఊహించుకొని వానితో అతడు మాట్లాడుతున్నట్లు సంభాషణ కొనసాగుతుంది. సామాజకులు ఆ సంభాషణల ద్వారా ఊహించుకొని విషయాన్ని అర్థం చేసుకొంటారు. ఇదంతా ఏకపాత్రాభినయం. అనగా, విటుడు ఆకాశభాషితాలతో తానే అనుభవించిన లేదా ఇతరులు అనుభవించిన ధూర్తచరితాన్ని చమత్కారంగా వర్ణిస్తూ ఉంటాడు.
తన ఎదుట ఎవరో ఒక వ్యక్తి ఉన్నట్లు ఊహించుకొని, అతనితో చెపుతున్నట్లుగా, అతనితో మాట్లాడుతున్నట్లుగా సంభాషణ సాగించడం అనేదానిని ఆకాశభాషితం అంటారు. ఈ సంభాషణలో ఇతరులను పిలుచుట, యడుగుట, వినుట మొదలగునవి “ఓయీ”, “ఏమంటివి”, ఇట్లంటివా” యనునట్లు ఆకాశవచనములచే జరుగును.
అనగా, భాణము అనే ఈ రూపకమంతా, రంగస్థలం మీద ఒకే ఒక వ్యక్తి చేసే ఏకపాత్రాభినయమన్న మాట.
శూద్రకుడు రచించిన పద్మప్రాభృతకసౌరభం భాణము అనే రూపక భేదానికి సంబంధినది.
పద్మప్రాభృతకం లో ప్రథాన ఇతివృత్తం – మూలదేవుడు అనే వానికీ దేవసేన అనే వేశ్యకాంతకూ మధ్య కలిగిన ప్రణయప్రారంభం. మూలదేవుడికి కర్ణీసుతుడు లేదా కర్ణీపుత్రుడు అని మరొక పేరు ఉంది. ఇతడికి ఈ పేరు అతడి ధూర్త చోర ప్రవృత్తి ఆధారంగా వచ్చినది ఇతడు ధూర్తులకు, చోరులకు నాయకుడు.
బాణుడు కాదంబరీ కావ్యం లో కర్ణీసుతుణ్ణి గూర్చి, శశుణ్ణి గూర్చి ఇలాగ నిర్దేశిస్తాడు – “కర్ణీసుత కథేవ సన్నిహిత విపులాచలా, శశోపగతా చ“.
దణ్డి దశకుమార చరిత్ర లోని అపహార వర్మ చరిత్ర లో కూడా చౌర్యాన్ని గూర్చిన గ్రంథాన్ని రచ్చించినట్టుగా కర్ణీసుతుని నిర్దేశం ఉంది.
వైజయంతీ నిఘంటువులో “కర్ణీసుతః కరటకః స్తేయశాస్త్రస్య కారకః” అనియూ, “కర్ణీసుతో మూలదేవో మూలభద్రః కలాజ్ఞ్కురః” అని హారావళి లోనూ నిర్దేశింపబడినది.
కథావృత్తాంతం:
కర్ణీసుతుడి మిత్రుడు శశుడు. ఇతడు కూడా విటుడే! కర్ణీపుత్రుని ప్రేయసి దేవదత్త. నవోద్గతయైన ఈమె చెల్లెలు దేవసేనను ఈతడు ఎక్కడనో చూడటం తటస్థించింది. ఈమె కర్ణీపుత్రుని మనస్సుని ఆకర్షించింది. ఈమధ్య ఆమెకు అనారోగ్యం అని తెలుసుకుంటాడు మూలదేవుడు. క్షేమ సమాచారములు తెలుసుకొని రావలసినదిగా కర్ణీసుతుడు తన మిత్రుడైన శశుణ్ణి పంపుతాడు. ఆ పనిమీద వెడుతూ, శశుడు దారిలో చాలా రకాల మనుషులను కలుస్తాడు. ప్రతీవానితోనూ ఏవో ముచ్చట్లాడుతూ ముందుకు సాగుతాడు. ఆ విధంగా తను ముచ్చట్లాడిన వారందరూ వేశ్యాలంపటులు లేదా వేశ్యలు. దారిలో కనబడిన ఐదారుగురు వేశ్యాయువతులను వాళ్ళ ప్రియుల్నీ పలుకరిస్తూ చివరికి దేవసేన ఇంటికి చేరతాడు శశుడు.
దేవసేనకి కూడా కర్ణీపుత్రునిపై అభిలాష కలిగి ఉంది. కానీ, అక్కగారి ముఖం చూసి సందిగ్ధావస్థలో పడి ఉంది. శశుడు ఈమె మనసులోని భావాన్ని తెలుసుకుని, ఆమె కర్ణీపుత్రుణ్ణి చేరడంలో తప్పేమీ లేదని నచ్చచెపుతాడు. దీనికి తగ్గ ప్రమాణాల్ని చూపుతాడు.
దక్షాత్మజాః సున్దరి యోగతారాః కిం నైకజాతాః శశినం భజన్తే,
ఆరుహ్యతే వా సహకారవృక్షః కిం నైక మూలేన లతాద్వయేన
తాత్పర్యం:
ఒకే దక్షప్రజాపతి పుత్రికలైన అశ్విన్యాది తారలన్నీ ఒక్క చంద్రుణ్ణి ఆశ్రయించలేదా? ఒకే మూలంలో నుండి బయలుదేరిన రెండు లతలు ఒక సహకారవృక్షానికి అల్లుకోవా?
ఈ విధముగా సప్రణాముగా నచ్చచెప్పి ఆమెకు కర్ణీపుత్రుని మీద అనురాగం దృఢం అయ్యేట్టు చేస్తాడు శశుడు. ఆమె యొక్క అనురాగానికి చిహ్నంగా ఏదైనా కర్ణీసుతునికి ఇమ్మంటాడు.
అప్పుడామె తన చేతిలో విలాసార్థం ధరించి ఉన్న పద్మం కర్ణీసుతునికి ప్రాభృతంగా, అనగా, కానుకగా ఇమ్మని శశుడికి ఇస్తుంది.
ఈ పద్మాన్ని కానుకగా ఇవ్వడమే ఈ భాణానికి “పద్మప్రాభృతక సౌరభం” అనే పేరు పెట్టడానికి కారణం. ఈ పద్మప్రాభృతకం అనే ఈ భాణం ప్రమాణము చేత చిన్నదే.
అయితే ఈ భాణం యొక్క విశిష్టత ఏమిటీ అంటే, దీనిలో ఎన్నెన్నో చక్కని వర్ణనలూ, భాషాసంబంధమైన నూతన శబ్దప్రయోగాలూ ఉండడమే కారణం.
అంతే కాక, కవి, సుమారు రెండువేల సంవత్సరాల పైన ఉన్నట్టి ఆ నాటి సమాజంలో ఉన్న కొన్ని దురాచారాలనూ, అలవాట్లనూ, వైదిక బౌద్ధమతాదులలో ఉన్న కొన్ని డాంభికాచారాలనూ చాలా చక్కగా చిత్రించాడు. స్వస్వధర్మాలను బాగా ఆచరించే వారు చాలామందే ఉన్ననూ, వాళ్ళతో పాటు, వేశ్యావృత్తి, జూదం, మద్యపానం మొదలైన అలవాట్లు కలిగిన వాళ్ళు కూడా అధిక సంఖ్యలో ఉండేవాళ్ళు. ఈ పద్మప్రాభృతకంలో చిత్రించిన సమాజాన్ని చూస్తే, అలాగే మృచ్ఛకటికములోనూ, శూద్రకుడు ఈ నాటి సమాజాన్నే చిత్రిస్తున్నాడా అనిపిస్తుంది. ఒక్క పేర్లలో మాత్రమే భేదం!!
ఈ పద్మప్రాభృతకం లోని భాషావైవిధ్యాన్నీఇతివృత్త విశేషాలనూ, నూతన శబ్దప్రయోగాల గురించీ కొంత తెలుసుకుందాం. దేవసేన యొక్క క్షేమ సమాచారాలను తెలుసుకునేందుకు బయలుదేరిన శశుడు మార్గమధ్యం లో కలిసిన వారితో జరిపే సంభాషణలలోని భాషా చాతుర్యాన్ని, పదప్రయోగాల సౌందర్యాన్ని చూడండి. వినూత్న రీతిలో ఉంటాయి.
దేవసేన యొక్క క్షేమసమాచారాలను తెలిసికొని రమ్మని మూలదేవుడు శశుణ్ణి పంపగా అతడికి ముందుగా కనబడిన వాడు కాత్సాయన గోత్రుడైన సారస్వతభద్రుడు అనే కవి.
సఖే! కాత్యాయన! కిమిదమాకాశరోమన్థనం క్రియతే?
మిత్రమా! ఏదో ఆకాశాన్ని నెమరు వేస్తున్నావు?
ఏదో కావ్యాన్ని రచించాలనే ఆవేశంలో ఉన్నాను అని సమాధానం వస్తుంది.
పురాణకావ్యపదచ్ఛేదగ్రథన చర్మకారా?
పాత కావ్యాలలోని పదాలు ముక్కలుచేసి వాటిని అల్లే చర్మకారుడా అని సంబోధిస్తూ, ఏ విషయం తీసుకుని వ్రాస్తున్నావు అని అడుగుతాడు (స్వయం ప్రతిభ లేకుండా ఇతరులు వ్రాసిన రచనలలోని వాటిని సేకరించి కూర్పు చేసి వ్రాసే వాళ్ళు). ప్రస్తుతం ఉన్న వసంత ఋతువు గురించి వ్రాసాను అదిగో ఆ గోడమీద వ్రాసి ఉంది చూడు అంటాడు. శశుడు శ్లోకాన్ని చదివి, చాలా అద్భుతంగా ఉంది అంటూ వాక్పురోభాగానామ భాగీ భవ! – మాటలలో తప్పులు పట్టే వాళ్ళ బారిన పడకుండుదువు గాక అని ఆశీర్వదించి ముందుకు కదులుతాడు.
దగ్గరలో ఉన్న దర్దురకుడు అనే వాడు, ఇతడు కూడా విటుల కోవకి చెందిన వాడే, ఇంత ప్రసిద్ధుడైన కవికి నీ ఆశీర్వాదం ఎందుకు అని వ్యంగ్యంగా, సముద్రాభ్యుక్షణం క్రియతే యద్వాగీశ్వరం వాగ్భిరర్చయసి – నువ్వు వాగీశ్వరునికి వాక్కుతో చేసే అర్చనం సముద్రం మీద నీళ్ళు చల్లినట్టు ఉంది అని నవ్వుతాడు.
సూర్యం యజన్తి దీపైః సముద్రమద్భిః వసన్తమపి పుష్పైః
అర్బామో భగవన్తం వయమపి వాగీశ్వరం వాగ్భిః
సూర్యుణ్ణి దీపాలు చూపించి పూజిస్తుంటారు. సముద్రాన్ని నీళ్ళతో పూజిస్తారు. వసంతాన్ని పువ్వులతో పూజిస్తారు. మేం కూడా వాగీశ్వరుణ్ణి వాక్కులతో పూజిస్తాం అంటూ ముందుకు కదులుతాడు.
పిదప, దారిలో దత్తకలశి అనే వైయాకరణుడు కనిపిస్తాడు. అతడిని తప్పించుకునే ఆలోచనలో పడతాడు ఎందుచేతనంటే అతడి వాగ్వాగురం (మాటల పాశం) నుండి తప్పించుకోవడం కష్టం కావున. తప్పించుకునే మార్గం లేక “స్వాగతమక్షరకోష్టాగారాయ” అంటాడు. అనగా, అక్షరకోష్టాగారానికి (పదాల గోడౌన్ కి) స్వాగతం అని సంబోధిస్తాడు. దత్తకలశి శశుడితో ఎందుకు అలాగ పారిపోవాలనుకుంటున్నావు అని చాలా కఠినమైన పదాలు వాడతాడు. అప్పుడు శశుడు సాధు వ్యావహారికయా వాదా వద – వ్యావహారిక భాషతో కొంచెం మథురంగా మాట్లాడు, ఏవం విధైః కాష్టప్రహారనిష్టురైః వాగశనిభిః – ఇలాగ కర్రదెబ్బల వలె నిష్టురమైన మాటల పిడుగులతో నన్ను కొట్టవద్దు అంటాడు.
ఆ నాటికి, పాణినీయవ్యాకరణానికి పూర్తి ప్రామాణ్యం అంగీకరించబడలేదు. అందుచే ఈ పాణినీయ వ్యాకరణం చదువుకున్న వారికీ, ఇతర వ్యాకరణ పణ్డితులకీ వాదోపవాదాలు జరుగుతూ ఉండేవి.
అప్పుడు శశుడు – ఏమైనా నీ పద్ధతి ఏమీ బాగులేదు అంటాడు. ఎందువల్లనంటే –
స్వైరలాపే స్త్రీవస్యోపచారే
కార్యా (కవ్యా) రంభే లోకవాదాశ్రయే చ,
కః సంక్లేషః కష్టశబ్దాక్షరాణాం
పుష్పాపీడే కణ్టకానాం యథైవ
స్వేచ్ఛగా మాట్లాడుకొంటున్నప్పుడూ (కబుర్లు చెప్పుకొంటున్నప్పుడూ), స్త్రీ వయస్య (Girl Friend) తో ముచ్చటించేటప్పుడు, కావ్యాలలోనూ, లౌకిక విషయాలు మాట్లాడుకొనేటప్పుడు, పరుషాక్షరాలున్న శబ్దాలకి చోటెక్కడ? అలాంటి పదాలు ఉపయోగించడం తలలో ధరించడానికి తయారు చేసే పువ్వుల దండలో ముళ్ళు చేర్చి కట్టినట్టుంటుంది అంటాడు.
అందుకేనేమో నా ప్రేయసికి కోపం వచ్చింది అంటాడు దత్తకలశి. ఏమైంది చెప్పు విందాం అంటాడు శశుడు.
హవిస్సు హోమం చేయదలచుకున్నాను, నన్ను ముట్టుకోకు ఓసి అపవిత్రురాలా! అన్నాను నా ప్రేయసితో. దానితో ఆమెకి కోపం వచ్చింది.
అప్పుడు శశుడు నవ్వుతూ, ఏమి లోకజ్ఞానమురా నీది! వలచి వచ్చిన దానిని వ్యాకరణవిష్ఫులింగాభిః వాగ్భిః – వ్యాకరణము లోని బొగ్గు నిప్పు ముక్కల వంటి పదాలు ప్రయోగించి హడలుకొట్టడం ఏమంత బాగుంటుంది అంటూ ముందుకు కదులుతాడు.
అలాగ ఒక పూల అంగడి దాటి శశుడు ముందుకు వెళ్ళగా అతడికి ఒక ముసలి విటుడు కనిపిస్తాడు. అతడు పూర్వం నాటకాలలో విటుడుగా అభినయించే వాడు. అతడికి ప్రస్తుతం వేశ్యలందరూ పెట్టిన పేరు భావజరద్గవ – ముసలి ఆబోతు బావ. జుట్టుకీ శరీరానికీ ఏవేవో రంగులు పూసికొని జరాకౌపీనప్రచ్ఛాదనం – ముసలితనాన్ని కప్పుకోవడానికి నానావిధాల తంటాలు పడుతున్నాడు. అతడిని చూసి, నీవు పడే బాధ అంతా లేపేనేవ పురాణజర్జరగృహస్యాయోజితం యౌవనం – పాత ఇంటికి రంగు వేసి కొత్త దానిగా చేయడానికి ప్రయత్నించినట్టుంది.
ఇలాగా దారిలో కనబడిన ఐదారుగురు వేశ్యాయువతులను, వాళ్ళ ప్రియులనూ పలకరిస్తూ చివరకి దేవసేన ఇంటికి చేరతాడు.
అక్కడ ఆమెకు కర్ణీపుత్రునిమీద అనురాగం దృఢం అయ్యేట్టు చేసి, ఆమె అనురాగానికి చిహ్నముగా ఏదేని ఇమ్మని అడుగగా ఆమే విలాసార్థం తన చేతిలో ధరించి ఉన్న పద్మం అతనికి తననుండి ప్రాభృతంగా (కానుకగా) ఇమ్మని శశుడికి ఇస్తుంది. ఇదే ఈ భాణానికి పద్మ ప్రాభృతం అనే పెరు పెట్టడానికి కారణం.
నూతన శబ్దప్రయోగాలు:
- అక్షరకోష్ఠాగారం – పదాల గోడౌన్ – Dictionary
- దివాదీపప్రజ్వాలనం – పగలు దీపం వెలిగించడం. అనగా వ్యర్థప్రయత్నం చేయడం.
- గోపాలకులేతక్రవిక్రయః – గొల్లపల్లెలో మజ్జిగ అమ్మడం. అనగా వ్యర్థమైన పనిచేయడం.
- న సూర్యః దీపేన అన్ధకారః ప్రవిశతి – సూర్యుడు దీపం వెలిగించుకుని అంధకారంలో ప్రవేశించడు.
- ఆకాశరోమన్థనం – ఆకాశం నెమరువేయడం. అనగా ఏదో ఆలోచిస్తూ కూర్చోవడం. Woolgathering.
- సర్వమచిరాదత్యాయతం ఛిద్యతే – గట్టిగా లాగితే ఏదైనా తెగిపోతుంది
- సందంశేన నవమాలికామపచినోషి – పట్టకారుతో నవమాలికాపుష్పాలను కోస్తున్నావు. Handling rough
- ఉష్ణస్థలీకూర్మలీలా – వేడెక్కినచోట తాబేలు ఉన్నట్టు
- గర్వైకవ్రతశాలినీ – ఒక్క గర్వం అనే వ్రతం మాత్రమే పట్టినది. అంటే, చాలా పొగరుమోతు, గర్విష్టి అని అర్థం. Very arrogant
- కావ్యవ్యసనీ – ఏదో కావ్యం వ్రాయాలనే తపన, అత్యాసక్తి కలవాడు.
- సాధు వ్యావహారికయా వాదా వద – వ్యావహారిక భాషతో కొంచెం మథురంగా మాట్లాడు.
- ఏవం విధైః కాష్టప్రహారనిష్టురైః వాగశనిభిః – ఇలాగ కర్రదెబ్బల వలె నిష్టురమైన మాటల పిడుగులతో నన్ను కొట్టవద్దు.
- క్షిప్తః కదర్థయిత్వా హేమన్తే తాలవృన్త ఇవ – హేమంతంలో విసనకర్రను దూరంగా పారవేసినట్లు తిట్టి దూరంగా పంపివేయబడిన వాడు. Shunting away unceremoniously.
- సుహృత్కుముదాననవబోధయన్ దివాచంద్రలీలయాతిక్రామసి – పగటి చంద్రుడు వలె మిత్రులనే కలువలను వికసింపజేయకుండా వెళ్ళిపోతున్నావు. Leaving with out doing any good to the needy. అనగా, అవసరం ఉన్న వాళ్ళకి ఏమీ చేయకుండా వెళ్ళిపోవడం.
- పాయసోపవాసః – పాయసం తిని ఉపవాసం చేయడం
- మదనీయం ఖలు పురాణమధు – పాత మద్యం బాగా మత్తెక్కిస్తుంది
- న దీపేన అగ్నిమార్గణం క్రియతే – దీపంతో అగ్నిని వెదకరు
- న వాయసోచ్ఛిష్టతీర్థజలముపహతం – కాకి ఎంగిలికి తీర్థజలం అపవిత్రం కాదు.
- ఇదం ఖలు వర్షర్తుజ్యోత్స్నాదర్శనం – వర్షర్తువులో వెన్నెల కనబడడం. అనగా, ఏడుస్తూ చిరునవ్వు నవ్వడం లేదా ఏడవ లేక నవ్వడం
- దీర్ఘసూత్రతా నామ కార్యాన్తరముత్పాదయతి – ఒక పని చేయడంలో ఎడతెగని ఆలోచన చేస్తే, కొత్తపనులు పుట్టుకు వస్తాయి. అంటే, కొత్త పనులు చేయవలసి వస్తుంది.
- అనాగతసుఖాశయా ప్రత్యుపస్థితసుఖత్యాగో న పురుషార్థః – ఎప్పుడో సుఖం వస్తుందనే ఆశతో వచ్చిన సుఖాన్ని వదులుకోవడం పురుషార్థం కాదు. అనగా తెలివైన పని కాదు.
- మేఘావగూఢమపి చంద్రమసం కుముద్వతీప్రబోధః సూచయతి – మేఘాలు కప్పిఉన్నా కూడా చంద్రుడు ఉదయించినట్టు కలువల వికాసం సూచిస్తుంది.
- లజ్జా నామ విలాసయౌతుకం ప్రమదాజనస్య – సిగ్గు అనేది స్త్రీల విలాసరూపమైన సొత్తు. యౌతుకం అనగా Personal Property. స్త్రీణామాద్యం ప్రణయ వచనం విభ్రమోహి ప్రియేషు అని మహాకవి కాళిదాసు మేఘసందేశంలో అంటాడు. ప్రియుల విషయంలో స్త్రీలు వ్యక్తం చేసే మొదటి ప్రణయ వచనం సిగ్గుతో కూడిన వారి విభ్రమవిశేషాలే అని అంటాడు.
- వాక్పురోభాగానామ భాగీ భవ! – మాటలలో తప్పులు పట్టే వాళ్ళ బారిన పడకుండుదువు గాక
- సముద్రాభ్యుక్షణం క్రియతే యద్వాగీశ్వరం వాగ్భిరర్చయసి – వాగీశ్వరునికి వాక్కుతో చేసే అర్చనం సముద్రం మీద నీళ్ళు చల్లినట్టు.
- వ్యాకరణవిష్ఫులింగాభిః వాగ్భిః – వ్యాకరణము లోని బొగ్గు నిప్పు ముక్కల వంటి పదాలు .
- జరాకౌపీనప్రచ్ఛాదనం – ముసలితనాన్ని జర అనే కౌపీనం కౌపీనం (గోచీ) తో కప్పుకొనడం. వయసు మీద పడడం.
- భావజరద్గవ – ముసలి ఆబోతు బావ
- లేపేనేవ పురాణజర్జరగృహస్యాయోజితం యౌవనం – పాత ఇంటికి రంగు వేసి కొత్త దానిగా చేయడం.
ఆవిడ మహా మహా పొగరుమోతు – గర్వైకవ్రతశాలినీ; మహా సుత్తి కొట్టేస్తున్నాడు, వీడి సుత్తి నుండి తప్పించుకోవడం కష్టమే – వాగ్వాగురం (మాటల పాశం) నుండి తప్పించుకోవడం; మాటలతో అమ్మో వాయించేస్తున్నాడు, అబ్బా బాదేస్తున్నాడు, చావగొడుతున్నాడు – ఏవం విధైః కాష్టప్రహారనిష్టురైః వాగశనిభిః; కాస్త సరళంగా మాట్లాడవచ్చు కదా – సాధు వ్యావహారికయా వాదా వద; వగైరా వగైరా అన్నీ మనం ప్రస్తుతకాలంలో సామాన్య జనం మాట్లాడుకునేప్పుడు వ్యక్తం అయ్యే భావజాలము, భావ ప్రకటన, స్పందన ప్రతిస్పందనలూ అన్ని కూడా సరిగ్గా రెండు వేల సంవత్సరాలకు పైనే వ్యక్తీకృతమయ్యే విధంగానే ఉన్నది అని స్పష్టం అవుతోంది. అంటే మనం ప్రస్తుతం వ్యక్తం చేసే పదాలేవీ మనం కొత్తగా కనిపెట్టినవేవీ కాదు, రెండువేల సంవత్సరాలకు పైనే ఇలాంటి పదప్రయోగాలన్నీ వాడుకలో ఉండడమే కాక కావ్యాలలోకి కూడా చొప్పించుకు పోయాయి. ఇది గ్రహించవలసిన విషయం.
గమనిక:
ఈ గ్రంథ పరిచయ వ్యాసమునకు పరిశీలించిన, ఉపయుక్తమైన ఏకైక పుస్తకం పుస్తకము
- – ఆచార్య డా. పుల్లెల శ్రీరామచంద్రుడు – సంస్కృత భాషా ప్రచార సమితి, హైదరాబాదు వారి ప్రచురణ
విషయ సేకరణ, అభిలేఖనము: ఓ.వెం.ల.న. మూర్తి – O.V.L.N. Murthy
Date: Tuesday, 30th August 2022